Publish Date: Sat, 23 Mar 2019 (11:01 IST)
Updated Date: Sat, 23 Mar 2019 (11:03 IST)
ఆంధ్రప్రదేశ్లో మనం కులాలు, మతాలుగా విడిపోయి కొట్టుకుంటుంటే ఆంధ్రా వాళ్లను అలుసుగా భావించే తెలంగాణ వాళ్లు కుల, వర్గ విభేదాల్లేకుండా ఐక్యంగా మనవారిని చితక్కొడుతున్నారని జనసేనాని పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. పవన్కల్యాణ్ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి అని, ఆయన బాధ్యతరాహిత్యంతో మాట్లాడడం సరికాదని హితవు పలికారు.
పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్లో ఘాటుగా సమాధానమిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా పవన్ మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఆయన మాటలు ప్రజల్ని తప్పుతోవ పట్టించేలా ఉన్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో ఆంధ్రా ప్రజలే కాదు దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాల ప్రజలు సమైక్యంగా వున్నారని గుర్తు చేశారు. ఇంకా తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు చెందిన వారు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు.