Publish Date: Fri, 22 Mar 2019 (13:28 IST)
Updated Date: Fri, 22 Mar 2019 (13:30 IST)
కోడికత్తి దాడిపై నానా హంగామా చేసిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి.. సొంత బాబాయ్ వివేకా హత్యకు గురైతే మౌనంగా ఎందుకు వున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. హత్యారాజకీయాలు చేసేవారు అధికారంలోకి వస్తే... రాష్ట్రం ఏమవుతుందో అనే భయం తనను వెంటాడుతోందని వ్యాఖ్యానించారు.
ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి తన సొంత బాబాయి హత్యకు గురైతే దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని, అది మీకు తెలియదా? నేనైతే నమ్మడంలేదని జనసేనాని తెలిపారు. సొంత మనిషి చనిపోయినా అదేమంత పెద్ద విషయం కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ఓటు వేసే ముందు ప్రజలు అన్ని విషయాలను ఆలోచించాలని... ఎవరి హయాంలో మేలు జరిగింది, ఎవరి హయాంలో అవినీతి, ఘోరాలు జరిగాయో బేరీజు వేసుకోవాలని పవన్ సూచించారు.
జనసేనలో చేరుతామని కొందరు నేతలు వచ్చారు. కానీ తర్వాత వైకాపాలోకి వెళ్లారని పవన్ గుర్తుచేశారు. వీరంతా వైకాపాలోకి వెళ్లేందుకు కారమంగా హైదరాబాదులో వారికి ఆస్తులు వుండటమేనని తెలియవచ్చిందన్నారు.
ఆస్తులకు సంబంధించి తమకు సమస్యలు ఉన్నాయని వారు చెప్పారని తెలిపారు. జరుగుతున్నవన్నీ గమనిస్తుంటే... అసలు రాజకీయం అర్థమవుతోందని చెప్పారు. నాయకులను బెదిరించి రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు.