Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రైవర్ హత్యకేసులో ఐఏఎస్ అధికారి కుమారుడే నిందితుడా? అశ్లీల వీడీయోలే కారణం!

ఐఏఎస్‌ అధికారి భార్య కారు డ్రైవర్‌ నాగరాజు హత్య కేసు మిస్టరీ వీడుతున్నట్లు పోలీసుల బోగట్టా. ఈ హత్యలో ఐఏఎస్‌ కుమారుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. అశ్లీల వీడియో దృశ్యాలకు సంబంధించి ఇద్దరి మధ్య వివాదమే హత్యకు దారితీసి ఉండవచ్

డ్రైవర్ హత్యకేసులో ఐఏఎస్ అధికారి కుమారుడే నిందితుడా? అశ్లీల వీడీయోలే కారణం!
హైదరాబాద్ , మంగళవారం, 21 మార్చి 2017 (02:04 IST)
ఐఏఎస్‌ అధికారి భార్య కారు డ్రైవర్‌ నాగరాజు హత్య కేసు మిస్టరీ వీడుతున్నట్లు పోలీసుల బోగట్టా. ఈ హత్యలో ఐఏఎస్‌ కుమారుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. అశ్లీల వీడియో దృశ్యాలకు సంబంధించి ఇద్దరి మధ్య వివాదమే హత్యకు దారితీసి ఉండవచ్చని భావిస్తున్నారు. తండ్రీకొడుకులు ఇద్దరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధ్రువీకరించడం లేదు. పోలీసు శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సూర్యాపేట జిల్లా దుబ్బతండాకు చెందిన భూక్యా నాగరాజు అలియాస్‌ నాగు (28) భార్య జమున, ఇద్దరు పిల్లలతో కలసి హైదరాబాద్‌ చేరాడు. రహమతనగర్‌లోని జవహర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. వ్యవసాయ శాఖలో జాయింట్‌ సెక్రటరీగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు భార్య దగ్గర కారు డ్రైవర్‌గా చేరాడు.

 
 
ఈ క్రమంలో ఐఏఎస్‌ కుమారుడు సుశ్రుత వెంకట్‌ (24)తో నాగరాజుకు స్నేహం కుదిరింది. వీలు కుదిరినప్పుడల్లా ఇద్దరూ కలిసి మద్యం సేవించేవారు. ఈనెల 17వ తేదీ రాత్రి నాగరాజు, వెంకట్‌ యూసు్‌ఫగూడ సాయి కల్యాణ్‌ అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో ఇద్దరి మధ్య స్వల్ప వివాదం మొదలైంది. అది కాస్తా గొడవగా మారటంతో కోపం పట్టలేని వెంకట్‌.. డ్రైవర్‌ నాగరాజు తలను నేలకేసి కొట్టాడు. బలమైన దెబ్బలు తగలడంతో నాగరాజు మృతిచెందాడు. అక్కడ నుంచి వెళ్లిపోయిన వెంకట్‌ ఈనెల 18వ తేదీ రాత్రి మరో యువకుడితో కలసి నాగరాజు మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. అవకాశం కుదరకపోవటంతో 19వ తేదీ (ఆదివారం) సాయంత్రం మళ్లీ వచ్చి మృతదేహాన్ని మూటగా కట్టి కిందకు దించేందుకు ప్రయత్నించాడు. మెట్ల వద్దకు రాగానే అలికిడి విన్న అపార్ట్‌మెంట్‌లోని రిటైర్డ్‌ ఉద్యోగి సాంబశివరావు అతడిని ప్రశ్నించాడు.
 
దీంతో కూడా వచ్చిన యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు. తీవ్ర దుర్గంధం రావటంతో అపార్ట్‌మెంట్‌వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మూటలో యువకుడి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. సీసీ ఫుటేజ్‌ పరిశీలించారు. 17వ తేదీ రాత్రి అపార్టుమెంట్‌పైకి ఇద్దరు యువకులు వెళ్లారని, వారిలో ఒకరే తిరిగి వచ్చారని గుర్తించారు. దాని ఆధారంగా మృతదేహం నాగరాజుదని, తిరిగి వచ్చిన యువకుడు వెంకట్‌ అని నిర్ధారించారు. ఇక, ఈ కేసు నుంచి తప్పించేందుకు ఐఏఎస్‌ అధికారి విఫలయత్నం చేశారు. మూడు రోజులుగా కారు డ్రైవర్‌ కనిపించట్లేదని జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అప్పటికే తమ వద్దనున్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు ఆయనకు చూపారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని వివరించారు.
 
నాగరాజు, వెంకట్‌ మధ్య వివాదానికి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియోలే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకట్‌ ఓ యువతితో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను నాగరాజు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడని, వాటితో వెంకట్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు డిమాండ్‌ చేశాడని తెలిసింది. ఈ వివాదమే హత్యకు దారి తీసి ఉండవచ్చనే కోణంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. హత్యానంతరం నాగరాజు సెల్‌ఫోన్‌ను వెంకట్‌ చెత్తకుండీలో పారేసినట్లు సమాచారం. అది ఓ మహిళకు దొరికినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఆ మొబైల్‌ను స్విచ్ఛాఫ్‌ చేసినట్లు సమాచారం. ఆ సెల్‌ఫోన్‌ లభిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
 
మృతుడి భార్య జమున, కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌ ఠాణా వద్ద కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాత్రి వెంకట్‌ తమ ఇంటికి వచ్చి భర్తను తీసుకెళ్లినట్లు ఆమె తెలిపింది. ఓ మహిళ ప్రమేయంతోనే ఈ హత్య జరిగినట్లు జమున ఆరోపించింది. దర్యాప్తులో లభించిన సాక్ష్యాల ఆధారంగా కేసు నమోదు చేశామని, నిందితులు ఎంతటివారైనా కఠినంగా వ్యవహరిస్తామని వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు హామీనివ్వటంతో ఆందోళన విరమించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెలికాం రంగంలో అసలైన బాహుబలి ఆవిర్భావం: ఎయిర్‌టెల్ మటాష్