Publish Date: Fri, 28 Feb 2020 (12:21 IST)
Updated Date: Fri, 28 Feb 2020 (12:23 IST)
పోకిరీల వేధింపులు భరించలేక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది. హైదరాబాదు లోని జీడిమెట్లలో ఉంటున్న విద్యార్థిని తన ఆత్మహత్యకు పోకిరీల వేధింపులే కారణమంటూ మూడు పేజీల సూసైడ్ లేఖ రాసింది. తాను కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో పోకిరిగా బెడద ఎక్కువగా ఉంటుందని, వీళ్ళని నిలువరించలేక పోతున్నామని, పోకిరిల నుంచి మమ్మల్ని కాపాడాలని పేర్కొంది.
తన లేఖలో నాకు అమ్మ, నాన్న లేరు. ప్రేమించిన వాడు ఆప్యాయంగా మాట్లాడటంలేదు. కనీసం నా కోసం కొంత సమయాన్ని కేటాయించడంలేదు. కాలేజీకి వస్తుంటే బస్తీలో పోకిరీలు వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారు. నా బాధ ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి.. నేను ఎంత ప్రేమించినా నన్ను నన్నుగా ప్రేమించే వారు ఎవరూ లేరు.
ఇక నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి అంటూ మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంటర్మీడియేట్ విద్యార్థిని ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సూరారం డివిజన్ నెహ్రూ నగర్కు చెందిన తులసి(17)కి చిన్నతనంలోనే ఆమె తండ్రి లక్ష్మణ్, తల్లి సుశీల మృతి చెందారు. దీంతో అప్పటినుంచి ఆమె అమ్మమ్మ కోమలిబాయి వద్ద ఉంటూ చింతల్లోని బాగ్యరథి కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.