Publish Date: Tue, 28 Sep 2021 (10:22 IST)
Updated Date: Tue, 28 Sep 2021 (10:24 IST)
గులాబ్ తుఫాను తీరం దాటిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఏరులైపారుతున్నాయి. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురస్తున్న భారీ వర్షంతో ట్యాంక్ బండ్లో నీటి మట్టం 514.75 అడుగులకు చేరింది. దీంతో అధికారులు గ్లేట్లను ఎత్తి నీటిని కిందికి వదలారు. వరద నీరు భారీగా దిగువకు వస్తుండడంతో లోయర్ ట్యాంక్ బండ్ సహా సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.
ట్యాంక్బండ్కు దిగువ ప్రాంతాలైన కవాడీగూడ, లోయర్ ట్యాంక్ బండ్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు, జీహెచ్ఎంసీ అధికారులు కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
మరోవైపు, తెలంగాణలో 14 జిల్లాల్లో వాతావరణ శాఖ హై అలెర్ట్ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ప్రమాద హెచ్చరికలను జారీచేసింది
అలాగే ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేసింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో మంగళవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు.