Publish Date: Thu, 30 Sep 2021 (12:27 IST)
Updated Date: Thu, 30 Sep 2021 (12:28 IST)
తెలంగాణ రాష్ట్రంలో గులాబ్ తుఫాను బీభత్సం సృష్టించింది. గత సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల 50 వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. పత్తి, వరి, మొక్కజొన్న, సోయాబీన్, మిరప పంటలు దెబ్బతిన్నాయి.
మంగళవారం సాయంత్రానికి వర్షాలు కాస్త తగ్గినా వాగుల్లో ప్రవాహాలు మాత్రం తగ్గలేదు. చాలా చోట్ల లో లెవల్ వంతెనల పైనుంచే వరద ప్రవహిస్తోంది. దీంతో వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద పోటెత్తడంతో సిరిసిల్ల, నిజామాబాద్ పట్టణాలు జలమయమయ్యాయి.
గోదావరి, దాని ఉపనదులు ఉప్పొంగుతుండటంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గేట్లను ఎత్తివేసి, వరద నీటికి కిందకు వదిలేస్తున్నారు. మరోవైపు, రాష్ట్రంలో బుధవారం నుంచి 4 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.