Publish Date: Mon, 31 May 2021 (09:59 IST)
Updated Date: Mon, 31 May 2021 (10:01 IST)
మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో సోమవారం సాయంత్రం 5 గంటలకు భేటీ కానున్నారు. ఈటల, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డితో కలిసి ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. వారి వెంట మాజీ ఎంపీ వివేక్ కూడా ఉన్నట్లు తెలిసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నాలుగైదు రోజుల్లో ఈటల కాషాయ కండువా కప్పుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన అనంతరం ఈటల.. బీజేపీ రాష్ట్ర పార్టీ ముఖ్యులతో పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే.
సంజయ్తో నాలుగుసార్లు భేటీ అయిన ఆయన, కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో రెండు రోజుల కిందట సమావేశమయ్యారు. దీంతో ఈటల కమలం గూటికి చేరడం దాదాపు ఖరారయినట్లు కథనాలు వచ్చాయి. ఆయన చేరికకు సంబంధించి సంజయ్తో పాటు ముఖ్యనేతలు సీనియర్ నాయకుల అభిప్రాయం తీసుకున్నారు.
వీరి అభిప్రాయాలను పార్టీ జాతీయ నాయకత్వానికి సంజయ్ నివేదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో, ఈటల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పార్టీ జాతీయ నాయకత్వం, పూర్తి బాధ్యతలను సంజయ్కే అప్పగించినట్లు వివరించాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటికే ఈటల అంశంపై అటు జేపీ నడ్డాతో పాటు మరో ఇద్దరు అగ్రనేతలతో చర్చించిన సంజయ్, ఆయన పార్టీలో చేరే ముందు, నడ్డాతో లాంఛనంగా సమావేశం ఏర్పాటు చేశారు.
ఇందుకు అనుగుణంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు నడ్డా అపాయింట్మెంట్ ఇచ్చారు. కాగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశం ఈటలకే వదలిపెట్టనున్నట్లు సమాచారం. రాజీనామా చేసి రావాలా? లేదా? అన్నది ఈటల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, పార్టీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదని ఆయన తెలిపారు.
దీంతో, ఈటల రాజీనామా అంశంపై రెండు, మూడురోజుల్లో స్పష్టత రానుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ధీటుగా పోరాడాలంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడమే ఏకైక మార్గమని ఈటల రాజేందర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.