Publish Date: Wed, 11 Mar 2020 (05:23 IST)
Updated Date: Wed, 11 Mar 2020 (05:24 IST)
తెలంగాణలో రైతు రుణమాఫీకి రంగం సిద్ధమవుతోంది. 2018 డిసెంబర్ 11నాటికి ఉన్న రుణాల్లో లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలిదశలో రూ. 25వేల లోపు ఒకేసారి పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది.
రుణమాఫీకి సంబంధించి రెండురోజుల్లో మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. రైతు రుణమాఫీకి రంగం సిద్ధం బడ్జెట్లో రుణమాఫీకి నిధులు కేటాయించిన సర్కార్... ఈ మేరకు అమలు దిశగా కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రూ. 25వేలలోపు రుణాలకు సంబంధించి ఈ నెలలోనే చెక్కులు అందజేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
2018 డిసెంబర్ 11నాటికి ఉన్న రుణాల్లో రూ. లక్ష వరకు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులు 40 లక్షల మంది.. ఇందులో భాగంగా రుణం మొత్తం ఆధారంగా రైతులను ఐదు విభాగాలుగా చేశారు. రూ. 25వేల లోపు మాత్రమే అప్పు ఉన్న 5.83 లక్షల మంది పేర్లతో బ్యాంకులు జాబితాలు సిద్ధం చేశాయి.
వీరంతా ఎకరం లోపు భూమి ఉన్న అత్యంత నిరుపేదలై ఉంటారని తొలుత వీరికి మాఫీ చేయాలని సర్కారు నిర్ణయించింది. మొత్తం 40లక్షల 66వేల మంది రైతులకు బ్యాంకుల్లో రూ. 25వేల 936కోట్లు బకాయిలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధ్యయనంలో తేలింది.