Publish Date: Sat, 09 Jan 2021 (09:43 IST)
Updated Date: Sat, 09 Jan 2021 (09:44 IST)
వన్య ప్రాణులు జనవాసాలకు చేరుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పెద్ద పులులు ఓ వైపు, చిరుతలు మరోవైపు ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా ఓ మొసలి పంట పొలాలకు వచ్చింది. అంతే జనాలు దాన్నీ చూసి పారిపోయారు. కానీ జోగుళాంబ గద్వాల జిల్లాలో గత కొన్నిరోజులుగా పంటపొలాల్లో సంచరిస్తూ భయ భ్రాంతులకు గురిచేస్తున్న మొసలిని రైతులు పట్టుకున్నారు.
జిల్లాలోని మల్దకల్ మండలంలోని దాసరిపల్లి, ఉలిగేపల్లి గ్రామాల్లో ఉన్న పంట పొలాల్లో గత మూడు రోజులుగా మొసలి సంచరిస్తున్నది. దీంతో పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయాందోళనలకు గురయ్యారు. అయితే శుక్రవారం రాత్రి కొంత మంది రైతులు వలల సహాయంతో ఆ మొసలిని పట్టుకున్నారు. అనంతరం దానిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఎట్టకేలకు మొసలి పట్టుబడటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.