Publish Date: Tue, 17 Nov 2020 (21:35 IST)
Updated Date: Tue, 17 Nov 2020 (21:36 IST)
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రకటన నేపథ్యంలో నేటి నుండి అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో 4 వేలకు పైగా పోస్టర్లు, బ్యానర్లు తొలగించినట్టు జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారిగా ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటిని ప్రత్యేకంగా నియమించామని తెలిపారు. తక్షణమే నగరంలో వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
నేడు తొలగించిన ప్లెక్సీలు, బ్యానర్లలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రహరీగోడలు, ప్రధాన రహదారుల వెంట తొలగించినట్లు పేర్కొన్నారు. నగరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి సర్కిళ్లవారిగా నిఘా బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని డి.ఎస్.లోకేష్ కుమార్ వివరించారు.