Publish Date: Fri, 17 Jul 2020 (20:11 IST)
Updated Date: Fri, 17 Jul 2020 (20:13 IST)
కరోనా వ్యాప్తి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిజ్వి, ఆరోగ్య శాఖ వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని తెలిపారు. అదే సందర్భంలో నిర్లక్ష్యంగా ఉండరాదని తెలిపారు. కరోనా వైరస్ సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందనవసరం లేదని అన్నారు.
ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. కరోనా నివారణలోనూ, చికిత్స లోనూ సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువని సీఎం తెలిపారు. రికవరీ రేటు 67 శాతం ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం అదనంగా రూ.100 కోట్లు కేటాయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.