Publish Date: Fri, 10 Apr 2020 (18:09 IST)
Updated Date: Fri, 10 Apr 2020 (18:11 IST)
కరోనా వైరస్ కు ఇప్పటి వరకు ఎలాంటి మందు లేదని..నివారణ ఒక్కటే మార్గమని ప్రజలకు చెబుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. తాడ్వాయి మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ…కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో ఆయా గ్రామాల పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించారు. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కరోనాను అరికట్టేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు ఎమ్మెల్యే సీతక్క. కరోనా వైరస్ అంటువ్యాధి అని ఒకరి నుండి ఒకరికి అత్యంత తొందరగా చేరుకుంటుందని చెప్పారు.
దీన్ని కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించి ఇంట్లో నుండి బయటికి రాకుండా ఉండాలన్నారు.
ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్లాల్సి వచ్చినా ముఖానికి మాస్క్ పెట్టుకోవాలన్నారు . అలాగే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత శానిటైజర్ తోగానీ… సబ్బులతో చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు సీతక్క.