Publish Date: Mon, 15 Oct 2018 (12:08 IST)
Updated Date: Mon, 15 Oct 2018 (12:12 IST)
తెలంగాణలో ఎన్నికల వేడి బాగా రాజుకుంది. ఎన్నికలు శీతాకాలంలో అయినప్పటికీ నాయకులు మాత్రం ఎండాకాలం చూపిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు బలంగా సంధించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ... దొరా... మీరు ఎవరిని విమర్శిస్తున్నారు? 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీని. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శిస్తున్నారు?
అధికారంలోకి వచ్చి ఏం చేశారు? మీ పాలనలో 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీకు కనబడటంలేదా? దళితులపై జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తే... నీ మొగుళ్లు ఎక్కడున్నారే చెప్పమని జుట్టు పట్టుకుని స్త్రీలను లాగారు. ఇసుక మాఫియాను అడ్డగించినవారికి చితక బాదారు. బాంచన్ బతుకు వద్దు, మన సత్తా ఏమిటో వచ్చే ఎన్నికల్లో చాటాలి.
ఇంటింటికి నల్లా అన్నారు... ఏది ఒక్కటైనా వచ్చిందా? ప్రశ్నించేందుకు దొరలకు భయపడుతున్నారా? మీరు ప్రశ్నించాలి... ఇది రాములమ్మ మీ నుంచి ఎదురుచూస్తోంది. అభివృద్ధి ఏమీ జరుగలేదు. అడిగినవారిని అసభ్యకర పదజాలం ఉపయోగి బూతులు తిడుతున్నారు. ఇది బూతుల ప్రపంచం. అంతా కలసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకళిద్దాం'' అంటూ విజయశాంతి ఆవేశంగా మాట్లాడారు.