Publish Date: Thu, 27 Jul 2023 (10:43 IST)
Updated Date: Thu, 27 Jul 2023 (10:45 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై వేటువేసింది. అయితే, జిట్టా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.
వాస్తవానికి ఈయన బీజేపీలో ఉన్నప్పటికీ క్రియాశీలకంగా లేరు. అంతేకాదు, మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తాను మానసికంగా కమలం పార్టీకి ఎప్పుడో దూరమయ్యానని చెప్పారు. కాంగ్రెస్ నుండి ఆహ్వానం అందినట్లు తెలిపారు. అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను బీజేపీలో కార్యకర్తగా మాత్రమే ఉన్నానని, ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర నాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆయనపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, ఉమ్మడి నల్గొండలో, భువనగిరి నియోజకవర్గంలో జిట్టా బలమైన నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పని చేశారు. 2009లో తెరాస, బీఆర్ఎస్ పొత్తు కారణంగా టిక్కెట్ దక్కలేదు. ఆ సమయంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా స్వతంత్రంగానే పోటీ చేశారు. ఆ తర్వాత తన యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. కమలదళంలో తనకు గుర్తింపు లేదనే ఆవేదన ఆయనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.