Publish Date: Mon, 04 May 2020 (20:13 IST)
Updated Date: Mon, 04 May 2020 (20:22 IST)
దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటి హైదరాబాద్. మామూలు రోజుల్లో హైదరాబాద్ మహానగరం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. హైదరాబాద్ లో నిత్యం రద్దీ ఉంటుంది.
ఎక్కడికక్కడ వాహనాలు నిలబడిపోవడం, గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఇలా ఒక్కటి కాదు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్నది కాబట్టి ట్రాఫిక్ కు సంబంధించిన కష్టాలు తెలియడం లేదు. ఎక్కడికక్కడ అన్ని ఆగిపోవడంతో, అత్యవసర సిబ్బంది మినహా ఎవరూ కూడా రోడ్డుమీదకు రావడం లేదు.
అయితే, హైదరాబాద్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం మరోనెల సమయం పడుతుంది. ఈ నెల రోజులలోపుగా హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తరణ, మెయిన్ ట్రాఫిక్ జామ్ ఏరియాలను గుర్తించి అక్కడ రోడ్లు విస్తరించడం, లింక్ రోడ్లను అనుసంధానం చేయడం వంటివి చేయబోతున్నారట.
దీనికోసం స్థలాలు సేకరణా కోసం ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అధికారులకు ఇప్పటికే కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
లాక్ డౌన్ పూర్తయ్యి వాహనాలు రోడ్డుమీదకు వచ్చిన తరువాత ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా రోడ్ల విస్తరణ జరగాలని కేటీఆర్ సూచించారు. లాక్ డౌన్ తరువాత నగర ప్రజలు ట్రాఫిక్ లేని హైదరాబాద్ ను చూడబోతున్నారన్నమాట.