RTC workers: సమ్మె.. పెట్రోల్ పోసుకుని నిప్పంచికున్న ఆర్టీసీ డ్రైవర్ మృతి
Publish Date: Fri, 24 Apr 2026 (08:57 IST)
Updated Date: Fri, 24 Apr 2026 (09:19 IST)
రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్లతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కార్మికుల నిరసన రెండో రోజుకు చేరింది. తెలంగాణ వ్యాప్తంగా కార్మికులు డిపోల బయట ధర్నాలు, ప్రదర్శనలు చేస్తున్నారు. సమ్మెలో చురుకుగా పాల్గొంటున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్, తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అతనికి తీవ్రంగా కాలిన గాయాలవ్వడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
తొలుత వరంగల్ ఎంజీఎంకు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. శంకర్గౌడ్ మరణంతో రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదే తరహాలో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మరో ఇద్దరు డ్రైవర్లు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కార్మికుల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనను స్పష్టం చేస్తోంది. శంకర్గౌడ్ మృతికి ప్రభుత్వ వైఖరే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ వరుస పరిణామాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కార్మికులు ఆత్మహత్యల వంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్తో సహా పలువురు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం కార్మిక సంఘాల నాయకులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది.
తర్వాతి కథనం