Publish Date: Sat, 31 Jan 2026 (10:52 IST)
Updated Date: Sat, 31 Jan 2026 (10:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే అభ్యర్థులు తమ పన్ను బకాయిలన్నీ చెల్లించాలన్న నిబంధన ఉంది. పన్ను బకాయిలు చెల్లించి నూ డ్యూస్ సర్టిఫికేట్ సమర్పిస్తేనే నామినేషన్ పత్రాలను స్వీకరించేలా నిబంధన పెట్టారు. దీంతో మున్సిపాలిటీలకు కాసుల వర్షం కురుస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ కార్పొరేటర్ అభ్యర్థి ఏకంగా రూ.7.42 కోట్లు చెల్లించడం దీనికి నిదర్శనం.
ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ యజమాని కార్పొరేటర్గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆయన తన హోటల్కు సంబంధించి కొన్నేళ్లుగా పన్నులు చెల్లించడం లేదు. నామినేషన్ దాఖలు కోసం 'నో డ్యూస్' సర్టిఫికెట్ కోసం మున్సిపల్ అధికారులను ఆశ్రయించారు. పాత బకాయిలన్నీ చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని అధికారులు స్పష్టంచేశారు. దీంతో చేసేది లేక, సదరు నేత ఒకేసారి రూ.7.42 కోట్ల బకాయిలను చెల్లించి, 'నో డ్యూస్' పత్రాన్ని అందుకున్నారు.
ఈ ఒక్క ఘటనే కాదు, రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలలో ఇదే తరహాలో పన్నుల వసూళ్లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల నిబంధన బల్దియాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో దోహదపడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.