వివాహేతర సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతుంది. హైదరాబాద్ నగరంలోని మీర్ పేటలో ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే భార్య అతికిరాతకంగా హతమార్చింది. అనంతరం ప్రమాదవశాత్తు చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, చివరకు పోలీసులకు చిక్కింది.
వివరాల్లోకి వెళితే.. మీర్పేట్ పరిధిలోని జిల్లెలగూడ ప్రగతినగర్ కాలనీలో అల్లంపల్లి విజయకుమార్ (42), సంధ్య దంపతులు ముగ్గురు పిల్లలతో నివాసముంటున్నారు. విజయకుమార్ ఆటో నడుపుతుండగా, సంధ్య మీర్పేట్ మునిసిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది.
ఈ క్రమంలో సంధ్య తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అడ్డుగా వున్న భర్తను తొలగించుకోవాలనుంది. పక్కా ప్లాన్ ప్రకారం ఈ నెల 20వ తేదీన నీళ్లు తోడే బకెట్కు ఉన్న తాడును భర్త మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆపై కర్రతో తలపై కొట్టి, ప్రమాదంలా కనిపించేందుకు మృతదేహాన్ని బాత్రూమ్ వద్ద పడేసింది.
భర్త ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. వారు వెంటనే డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించగా, విజయకుమార్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అసలు విషయం బయటపడింది. బకెట్ తాడుకు రక్తం మరకలు ఉండటాన్ని మృతుడి తల్లి సత్తెమ్మ, స్థానికులు గమనించారు. దీంతో వారికి అనుమానం వచ్చి వెంటనే మీర్పేట్ పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో మెడకు తాడు బిగించడం వల్లే విజయకుమార్ చనిపోయినట్లు తేలింది. దీంతో సంధ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.