Publish Date: Wed, 21 Jan 2026 (11:15 IST)
Updated Date: Wed, 21 Jan 2026 (11:19 IST)
అనుమానంతో కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఈ దారణం హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా చింతకుంట కు చెందిన రొడ్డె ఆంజనేయులుకు కొల్లాపూర్కు చెందిన సరస్వతితో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నారు. అయితే కొంతకాలంగా భార్య సరస్వతిపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఫోన్ ఓపెన్ చేసి అన్నీ పరిశీలిస్తూ, ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లి ఏం చేస్తుందని గమనించేవాడు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య గొడవలు పెరిగాయి.
ఉద్యోగం మానేసి జులాయిగా తిరగసాగాడు. డబ్బుల్లేకపోవడంతో పిల్లలను సైతం బడికి పంపడం మాన్పించేశారు. అయినా ఆంజనేయులు బుద్ధి మారకపోవడంతో నీతో బతకలేనంటూ ఇటీవల పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి భార్యను ఇంటికి తీసుకొచ్చిన ఆంజనేయులు సోమవారం అర్ధరాత్రి తన పిల్లలతో కలిసి గాఢనిద్రలో ఉన్న సరస్వతి తలపై రోకలితో బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. హత్య అనంతరం ఆంజనేయులు అక్కడి నుంచి పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆంజనేయులు హత్య చేసిన అనంతరం తన స్టేటస్లో నా జీవిత భాగస్వామిని నేనే నా చేతులారా చంపుకున్నఅంటూ ఫొటో స్టేటస్ పెట్టుకోవడం గమనార్హం.