తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కుటుంబంలో గొడవ జరిగింది. ఇది విషాదాంతంగా ముగిసింది. ఇద్దరు కోడళ్ల మధ్య జరుగుతున్న పోట్లాటను ఆపేందుకు ప్రయత్నించిన అత్త, ఆ తోపులాటలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన బహదూరపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కిషన్ బాగ్లోని అసద్ బాబానగర్కు చెందిన మహమూద్ (45)కు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇటీవల షహజాదీ బేగం అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి సవతులైన ఇద్దరు భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి వీరి మధ్య మరోసారి వాగ్వాదం మొదలైంది.
ఈ గొడవను ఆపేందుకు మహమూద్ తల్లి మహమూబ్ బీ (65) వారి మధ్యలోకి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు కోడళ్లు ఆమెను పక్కకు నెట్టివేయడంతో అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమెకు రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా పెరిగిపోయింది.
వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.