Publish Date: Mon, 27 Apr 2026 (14:20 IST)
Updated Date: Mon, 27 Apr 2026 (14:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, గంపలగూడెం మండలం గోసవీడు గూడెంకు చెందిన ఓ బాలుడు గుండుసూదిని మింగేశాడు. దీన్ని వైద్యులు ఎంతో చాకచక్యంగా అయస్కాంతంతో వెలికి తీశారు. తాజాగా వెలుగులోకి వచ్చిచన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలం గోసవీడు అనే గూడెంకు చెందిన కోట వరుణ్ సందేశ్ అనే బాలుడు గ్రామంలోని ఒక ప్రైవేటు విద్యాలయంలో ఈ ఏడాది 8వ తరగతి పూర్తి చేశాడు.
వేసవి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉన్న అతను మూడు రోజుల కిందట దంతాలను గుండుసూదితో కుట్టుకుండగా గొంతులోకి జారిపోవడంతో మింగేశాడు. ఈ క్రమంలో అది ఊపిరితిత్తుల వద్దకు చేరి వాంతులతో పాటు సూది మొన గీసుకుపోయి నోటి వెంట రక్తం కూడా వచ్చింది. మొదట తెలంగాణలోని మధిరకు, అక్కడ నుంచి ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లినా సరైన చికిత్స అందలేదు. తర్వాత విజయవాడలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు చాకచక్యంగా గుండుసూదిని కడుపులో నుంచి బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు.
తొలుత చిన్న కెమెరాను కడుపులోకి పంపించి గుండుసూది ఊపిరితిత్తుల వద్ద ఆగిందని నిర్థారించారు. వైద్య నిపుణులు ఒక అయస్కాంతం కడుపులోకి పంపించి దాని సాయంతో గంటకుపైగా కష్టపడి చాకచక్యంగా బయటకు తీసినట్లు బాలుడి తండ్రి ఏసురత్నం ఆదివారం తెలిపారు. ప్రస్తుతం తమ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడని, ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చామని చెప్పారు. బాలుడి చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు.