Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇల్లు కూల్చేస్తే.. ఇంటికొకరు చొప్పున ఆత్మహత్య చేసుకుంటాం...

charminar
, శుక్రవారం, 8 డిశెంబరు 2023 (11:16 IST)
గత 70 యేళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, అలాంటిది తమ గృహాలు కూల్చివేస్తే ఇంటికి ఒకరు చొప్పున ఆత్మహత్య చేసుకుంటామని హైదరాబాద్ నగరంలోని స్వామి వివేకానంద నగర్ వాసులు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలోని గాంధీ నగర్‌ డివిజన్‌ బాకారం సమీపంలోని స్వామి వివేకానందనగర్‌ వాసులు గురువారం విలేకరుల ముందు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. 
 
70 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాం. పన్నుచెల్లిస్తున్నాం. కరెంట్‌, నల్లా బిల్లులు చెల్లిస్తున్నాం. కొందరికి ఇళ్లు రిజిస్ట్రేషన్‌ కూడా అయ్యాయి. ఇపుడు అర్థాంతరంగా వచ్చి జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది మీ 23 ఇళ్లను కూల్చివేస్తాం. పైనుంచి ఒత్తిడి ఉంది అంటూ తమను వారంరోజులుగా బెదిరిస్తున్నారు అంటూ వాపోయారు. ఇక్కడ 60 ఫీట్ల రోడ్డు వేసేందుకు తమ ఇళ్లను ఖాళీ చేయాలని వేధిస్తున్నారని అక్కడి వారు ఆరోపిస్తున్నారు. 
 
తమ తాతలకాలం నుంచి ఇక్కడే నివసిస్తున్న తమ ఇళ్లను కూల్చివేస్తే తాము ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నించారు. ఇళ్లను కూల్చివేస్తామని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 15 టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఇదెక్కడిన్యాయమని వారు ప్రశ్నించారు. తమ ఇళ్ల విషయంలో కోర్టులో కేసు కూడా నడుస్తోందని వారు తెలిపారు. గత వారం రోజులుగా కూల్చివేస్తామని సిబ్బంది వస్తున్నారని ఆరోపించారు.
 
గతంలో కోర్టు ఈ స్థలం ఈ పేదలకే చెందుతుందని తెలిపినా కూల్చివేతలకు సిద్ధం కావడం సమంజసంకాదన్నారు. త్వరలో కోర్టు నుంచి ఆర్డర్‌ వస్తుందన్న అనుమానంతో తమను ముందే ఇక్కడినుంచి ఖాళీ చేయించేందుకు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా తమను మానసికంగా హింసించడం తగదని వారు అన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అలాకాకుండా ఒత్తిడి చేస్తే మాత్రం ఇంటికి ఒకరు చొప్పున ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుణ్యక్షేత్రం వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య