హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెలలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారాసల మధ్యే నెలకొనుంది. అలాగే బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. దీంతో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప పోరు నామినేషన్ల ఘట్టం పూర్తికాకముందే వేడెక్కింది.
అయితే, ప్రధాన పార్టీల భవితవ్యాన్ని బీసీ, ముస్లిం ఓటర్లే నిర్దేశించనుండటంతో, వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి ఆయన సతీమణి మాగంటి సునీత పోటీలో ఉండగా, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ బరిలోకి దిగారు. భారతీయ జనతా పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు రెహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసుఫ్ గూడ వంటి డివిజన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటి ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు. తాము గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 కాగా, వీరిలో సగానికి పైగా బీసీ ఓటర్లే (దాదాపు 2 లక్షలు) ఉన్నారు. వారి తర్వాత అత్యధికంగా 96,500 మంది (24 శాతం) ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈ రెం0డు వర్గాల ఓట్లే గెలుపోటములను శాసించనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.