రిజర్వేషన్లు బీసీల హక్కు అని, దయా దాక్షిణ్యాల మీద ఇచ్చేవి కాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సమానత్వపు పునాదులపై కొత్త సమాజం ఏర్పాటు చేసేందుకే అవి ఉన్నట్లు చెప్పారు. బీసీల రిజర్వేషన్ అంశంపై ఆయన హైదరాబాద్ నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, రిజర్వేషన్ల సాధన కోసం ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వర్ రావు నేతృత్వంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇతర సంఘాలతో కలిసి ఈ కమిటీ కృషి చేస్తుందన్నారు.
'రిజర్వేషన్ల అంశంపై కొన్ని పార్టీలు ద్వంద వైఖరి అవలంభిస్తున్నాయి. కేసులు వేసిన వ్యక్తులకు మద్దతు తెలుపుతూ.. బీసీలకు అన్యాయం జరిగిందని ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ జన సమితికి రెండు నాలుకల ధోరణి లేదు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. కేంద్రంపైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును ఆమోదించేందుకే మా పోరాటం' అని అన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారాస గూబ గుయ్యమనేలా ఓటర్ల తీర్పు ఉంటుంది : పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చే నెలలో ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి గూబ గుయ్యిమనేట్లు ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారని మంత్రి పొన్నాల ప్రభాకర్ జోస్యం చెప్పారు. ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ చిరునామా గల్లంతవుతుందన్నారు.
పదేళ్లలో ఆ పార్టీ పాలనలో జూబ్లీహిల్స్లో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని ఆయన భారాస నేతలకు సవాల్ విసిరారు. 'అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఓడగొట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. జూబ్లీహిల్స్లో దొంగ ఓట్ల నమోదుకు భారత రాష్ట్ర సమితి, భాజపాలదే బాధ్యత. మాగంటి సునీతతో కన్నీరు పెట్టిస్తూ.. గులాబీ పార్టీ ఓట్లు దండుకోవాలని చూస్తోంది' అని పొన్నం విమర్శించారు.