Publish Date: Sat, 03 Jan 2026 (17:43 IST)
Updated Date: Sat, 03 Jan 2026 (17:57 IST)
తనపై విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో హాస్టల్ వార్డెన్ విచక్షణ మరిచిపోయాడు. నా మీదే ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అన్నంలో విషం కలిపి చంపేయండి అంటూ వంట సిబ్బంది హుకుం జారీచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.. ఆ వార్డెన్ను తక్షణం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ వార్డెన్ పేరు కిషన్ నాయక్. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం వార్డెన్గా విధులు నిర్వహిస్తున్నాడు.
గత కొన్ని రోజులుగా వార్డెన్ కిషన్ నాయక్ తీరుతో విసిగిపోయిన వసతి గృహంలోని విద్యార్థులు గురువారం రాత్రి రోడ్డెక్కారు. కడ్పల్ - సిర్గాపూర్ రహదారిపై బైఠాయించి వార్డెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక ఎస్ఐ మహేశ్, సర్పంచి శ్రీనివాసరావు విద్యార్థులకు నచ్చజెప్పారు. వసతి గృహానికి వచ్చిన ఏఎస్ డబ్ల్యూవో చందా శ్రీనివాస్కు వార్డెన్ తీరుపై ఫిర్యాదు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న కిషన్ నాయక్... శుక్రవారం ఉదయం మద్యం మత్తులో వసతి గృహానికి వచ్చి పిల్లలను అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చిపోయారు. వసతి గృహం సిబ్బందికి ఫోన్ చేసి అన్నంలో విషం కలిపి విద్యార్థులను చంపేయమని హుకుం జారీ చేశారు. ఈ ఫోన్ సంభాషణ బయటికి రావడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.