రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ముగ్గురు సోదరీమణులు ప్రాణాలు కోల్పోయారు. వీరి అంత్యక్రియలకు ఊరంతా తరలివచ్చింది. కన్నీటిపర్యంతమైంది. తీవ్ర దుఃఖంతో నిండిన హృదయాలతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను అంత్యక్రియలకు సాగనంపారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు తనూష, సాయిప్రియ, నందిని ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. సోదరీమణులు ఇటీవల ఒక వివాహానికి హాజరై హైదరాబాద్కు తిరిగి వస్తుండగా విషాదం సంభవించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ అక్రమంగా నిషేధిత సమయంలో భారీ లోడ్తో సిటీలోకి ఎంట్రీ ఇచ్చిందని తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్లోనే హైదరాబాద్ పోలీసులు రెండుసార్లు ఈ టిప్పర్ లారీకి జరిమానా విధించారు. చందానగర్ పరిధిలో ఓసారి, ఆర్.సీ పురం పరిధిలో మరోసారి ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా ఈ లారీ ఎంట్రీ ఇచ్చింది. అనిత అనే పేరుతో టిప్పర్ రిజిస్ట్రేషన్ అయ్యింది. ప్రమాద సమయంలో మోతాదుకు మించిన కంకర లోడ్తో పాటు ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు.