కొత్త సినిమాల విడుదల సమయంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచితే అందులో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని చట్టం తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత మల్లారెడ్డి స్పందించారు. హైదరాబాద్ నగరంలో ట్రేడ్ యూనియన్ నేతలు నిర్వహించిన ఓ సదస్సులో ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి పాల్గొన్నారు.
ఇందులో మల్లారెడ్డి మాట్లాడుతూ, సినిమా టిక్కెట్ రేట్లను పెంచితే అందులో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని చట్టం తెస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. అలాగే, పారిశ్రామికవాడల భూములను అమ్మితో అందులో కూడా 20 శాతం డబ్బులు పారిశ్రామిక కార్మికలకు ఇవ్వాలనే చ ట్టం కూడా తీసుకుని రావాలని ఆయన కోరారు.
అదేసమయంలో తమ పార్టీ పారిశ్రామిక కార్మికులకు అండగా నిలుస్తుందన్నారు. తమ సమస్యల పరిష్కారానికి కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడటానికి వారి ఖర్చుల కోసం రూ.10 లక్షలు విరాళంగా ఇస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే, ఈ సదస్సులో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, ఇండిగో పైలట్ల విషయంలో ఏడాది క్రితమే డీజీసీఏ షరతులు విధించిందని అన్నారు. దేశంలో విమానాలన్నీ టాటా, ఇండిగో చేతుల్లోనే ఉన్నాయి. ఐదు రోజుల తర్వాత కేంద్రమే వెనక్కి తగ్గింది. తాను ఇచ్చిన ఆదేశాలను తానే వెనక్కి తీసుకుంది. సంపద మొత్తం కొందరి చేతుల్లోనే ఉంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి. అది కూడా నాణ్యతతో ఉండాలి అని అభిప్రాయపడ్డారు.