Publish Date: Sat, 30 May 2026 (16:24 IST)
Updated Date: Sat, 30 May 2026 (16:29 IST)
భారత రాష్ట్ర సమితి నేత, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్కు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దీంతో ఆయనును తెలంగాణ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్లో ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్న నాంపల్లి పోలీసులు... బాల్క సుమన్ను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ, 'తెలంగాణ ఉద్యమంలోనూ నన్ను టార్గెట్ చేశారు. ఉద్యమ సమయంలో నాపై 250కి పైగా కేసులు పెట్టి.. అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇటీవల క్యాతనపల్లి ఎన్నిక సమయంలోనూ నన్ను జైల్లో పెట్టారు. అయినా, సరే ప్రజాప్రతినిధిగా ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నా. మరోసారి నన్ను జైలుకు పంపాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వివేక్ నిర్ణయించారు.
నన్ను జైల్లో పెట్టి పైశాచికానందం పొందాలని పాలకులు భావిస్తున్నారు. నాపై దృష్టి పెట్టే ముందు ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి. సింగరేణిలో వందల కోట్ల విలువైన స్కాములు జరుగుతున్నాయి. సింగరేణి కుంభకోణాలమయంగా మారిపోయింది. కాంగ్రెస్ పాలకులు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారు. చట్టంపై, వ్యవస్థలపై, రాజ్యాంగంపై నమ్మకం ఉంది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరిస్తా. నేను ఎక్కడికీ పారిపోలేదు.. పార్టీ కార్యక్రమంలో ఉన్నా ప్రశ్నించే నేతలను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది' అని బాల్క సుమన్ ఆరోపించారు.