తన కుమార్తె ప్రాణాలతో లేదని, అందువల్ల పెళ్లి సమయంలో వరకట్న కింద ఇచ్చిన బంగారు నగలు ఇచ్చేయాలని ఓ తండ్రి కోరుతున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణం భగత్ సింగ్ నగర్కు చెందిన సింగరేణి కార్మికుడు ముద్దసాని సురేష్ వివాహం పట్టణానికి చెందిన లావణ్య(29)తో 2021లో జరిగింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో కొన్ని రోజులుగా లావణ్య పుట్టింట్లో ఉంటున్నారు.
ఈ నెల 16న సింగరేణి కార్మికుడైన తండ్రి గాండ్ల సత్యంతో కలిసి వెళ్లిన లావణ్య పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట స్టేజీ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన లావణ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి లావణ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సురేష్, లావణ్యల మధ్య వివాదాల కారణంగా పోస్టుమార్టం అనంతరం శుక్రవారం రాత్రి ఆమె మృతదేహాన్ని అంబులెన్స్లో భర్త సురేష్ ఇంటికి తీసుకొచ్చి వరకట్నం తిరిగి ఇవ్వాలని ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా మృతదేహాన్ని ఆర్కేపీ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కట్నం డబ్బులు తిరిగి ఇవ్వకుంటే అంత్యక్రియలు నిర్వహించబోమని శనివారం బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. రెండు రోజులుగా మృతదేహం అంబులెన్స్లోనే ఉంది. మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, ఆర్కేపీ, మందమర్రి ఎస్సైలు వారికి నచ్చజెప్పి అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని వారి స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా ఓదెలకు పంపించారు.