Publish Date: Thu, 06 Dec 2018 (13:06 IST)
Updated Date: Thu, 06 Dec 2018 (13:07 IST)
కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్మరాస్ పేటలో నిన్న నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలో అదే తేలిందని అన్నారు. రైతు ఎవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దనీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పులను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లత్రాచు లాంటి వ్యక్తి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి ఓ ఉగ్రవాదిలా పోలీసులు తనను అరెస్ట్ చేశారని .. కొడంగల్ ప్రజలు 9 సంవత్సరాల క్రితం నాటిన మొక్క తానని వ్యాఖ్యానించారు. తనను కొడంగల్ ప్రజలు ఆశీర్వదించడంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు 100 అడుగుల గోతిలో పాతిపెట్టే రోజులు వచ్చాయన్నారు.