కావలసిన పదార్థాలు :
అలసందలు... ఒక కేజీ
మైదా... ఒక కేజీ
బెల్లంతురుము.. ముప్పావు కేజీ
నెయ్యి... పావు కేజీ
కొబ్బరిపొడి.. వంద గ్రా.
యాలక్కాయలపొడి... రెండు టీ.
రీఫైండ్ ఆయిల్... అరకప్పు
పల్లీల పొడి... అరకప్పు
ఉప్పు... తగినంత
నీళ్లు.. తగినన్ని
తయారీ విధానం :
ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ ముద్దలా కలిపి ఒక గిన్నెలో ఉంచాలి. ఈ గిన్నెను తడిబట్టతో కప్పి రెండు గంటలపాటు నాననివ్వాలి. అలసందలను శుభ్రం చేసి ఒక రోజు ముందే కడిగి నానబెట్టాలి. తరువాతి రోజు వాటిని నీళ్లు వంపేసి కుక్కర్లో ఉడికించి తీయాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడిలా కొట్టాలి.
ఓ బాణలిలో బెల్లం వేసి పాకం పట్టి, అందులో యాలక్కాయలపొడి వేయాలి. అందులోనే కొద్దిగా నెయ్యి, పల్లీల పొడి, కొబ్బరిపొడి వేసి బాగా కలిపి ఆరిన తరువాత కావాల్సిన సైజులో ముద్దలుగా చేసుకోవాలి. మైదాను చిన్న చిన్న ఉండలుగా చేసి అరచేసితో కొద్దిగా ఒత్తి అందులో అలసందల ముద్ద పెట్టి నాలుగువైపులా పిండితో మూసివేసి, ప్లాస్టిక్ కవర్మీద నెయ్యి రాసి అప్పడంలా గుండ్రంగా చేతితో వత్తుకోవాలి. అలా మొత్తం పిండినంతా చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్పై పెనం పెట్టి సన్నటి సెగమీద.. పైన వత్తుకున్న వాటిని వేసి, నెయ్యి వేస్తూ, అటూ ఇటూ తిప్పుతూ దోరగా కాల్చి తీసేయాలి. అలాగే మొత్తం అన్నింటినీ కాల్చుకోవాలి. అంతే అలసందలతో బొబ్బట్లు తయారైనట్లే.. పది రోజులదాకా తాజాగా ఉండే ఈ బొబ్బట్లు చిన్నారులకు మంచి పౌష్టికాహారం కూడానూ... మీరూ ట్రై చేయండి మరి..!!