Publish Date: Fri, 07 Feb 2020 (17:16 IST)
Updated Date: Fri, 07 Feb 2020 (17:19 IST)
మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 8వ తేదీన వచ్చేస్తోంది. ఈ రోజున రసగుల్లా స్వీట్ చేసి అందరికీ పంచండి. నైవేద్యంగానూ ఈ వంటకాన్ని సమర్పించుకోవచ్చు. ఈ వంటకం బెంగాల్, ఒరిస్సా సంప్రదాయక వంటకం.
కావలసిన పదార్థాలు
పాల విరుగుడు : ఒక కప్పు
యాలకుల పొడి - పావు టీ స్పూను
పంచదార : అర కప్పు
నీళ్లు : తగినంత
తయారీ విధానం :
పాల విరుగుడును నీరులేకుండా వడకట్టి, విరిగిన ఆ పాలగడ్డలను చల్లటి నీటితో కడిగి, ఒక కాటన్ వస్త్రంలో పెట్టి నీరంతా పోయేలా ముడివేసి దానిపై ఏదైనా బరువు పెట్టాలి. నీరంతా పోయిన తరువాత విరిగిన పాలను పొడిపొడిగా చేసుకుని బాగా కలుపుకుని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను కొంచెం కొంచెం అరచేతుల్లోకి తీసుకుని బాగా వత్తుకుంటూ, పగలకుండా చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక గిన్నెలో పంచదార, నీరు కలిపి లేత పంచదార పాకం పట్టుకోవాలి. అందులో యాలకుల పొడి వేసి, అది పొయ్యి మీద ఉండగానే అందులో ఉండల్ని వేసి, మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఉండలు రెండింతలుగా ఉబ్బిన తరువాత దించి రసగుల్లాలను చల్లారనిచ్చి, ఫ్రిజ్లో పెట్టి చల్లచల్లగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి. దీన్ని పాలు విరిగినప్పుడు చేయొచ్చు.
తాజా పాలతో చేయాలనుకుంటే, పాలను కాచిన తర్వాత నిమ్మరసం వేసి బాగా కలిపితే, మెల్లగా పాలు విరిగి పైనంతా పెరుగులా పేరుకుంటుంది. ఆ పాల విరుగుడును రసగుల్లాకు ఉపయోగించుకోవచ్చు. అంతే రసగుల్లా రెడీ అయినట్టే.
సెల్వి
Publish Date: Fri, 07 Feb 2020 (17:16 IST)
Updated Date: Fri, 07 Feb 2020 (17:19 IST)