Publish Date: Mon, 12 Apr 2021 (10:54 IST)
Updated Date: Mon, 12 Apr 2021 (10:57 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో మంగళవారం వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, మామిడి తోరణాలను ఇప్పటికే సిబ్బంది ఏర్పాటు చేశారు.
కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న నేపథ్యంలో కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం వేడుకలు జరగనున్నాయి. 21న శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ఆలయ ప్రాంగణంలోని నిత్యకల్యాణ వేదిక వద్ద నిర్వహించనున్నారు. 22న మహాపట్టాభిషేకం కూడా అదే వేదికలో జరగనుంది.
ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకపోవడంతో నిరాడంబరంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భద్రాద్రి రామాలయంలో మంగళవారం నుంచి ఈనెల 27 వరకు నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు. అలాగే 17 నుంచి 27 వరకు దర్బారు సేవలను, ఈనెల 17 నుంచి మే 4 వరకు పవళింపు సేవలను కూడా నిలిపివేయనున్నారు.