భారత స్టాక్ మార్కెట్ ఆరు రోజుల తర్వాత నష్టాలను చవిచూసింది. వరుసగా ఆరు రోజుల పాటు లాభాల్లో ముగిసిన సెన్సెక్స్ సూచీ.. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 190 పాయింట్ల నష్టంతో 26845 వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ సైతం 48 పాయింట్లును కోల్పోయి 8129 వద్ద ఆగింది.
వరుసగా ఆరు సెషన్లలో లాభాలను నమోదు తర్వాత ఇన్వెస్టర్లు తమ ఈక్విటీలను విక్రయించేందుకే మొగ్గు చూపారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలలో సైతం ఇదే ట్రెండ్ కనిపించింది. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపు వద్ద ఉన్న సెన్సెక్స్ సూచిక ఆపై నెమ్మదిగా కిందకు జారిపోయింది.
మంగళవారం నాటి సెషన్లో రూ.99,30,391 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్, రూ.98,81,674 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.01 శాతం, స్మాల్ క్యాప్ 0.15 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో అల్ట్రా టెక్ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, వీఈడీఎల్, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, గెయిల్, రిలయన్స్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టాలను చవిచూశాయి.