Publish Date: Thu, 05 Jun 2014 (16:45 IST)
Updated Date: Thu, 05 Jun 2014 (16:47 IST)
బాంబే స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ సూచీ తొలిసారి 25 వేల మార్కును తాకింది. కీలక వడ్డీ రేట్లను మార్పు చేయకుండా ఆర్బీఐ యధాతథంగా ఉంచడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ ఏకంగా 213 పాయింట్ల మేరకు లాభపడి, 25019 వద్ద ముగిసింది.
అదేవిధంగా నిఫ్టీ కూడా 71 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 7474 వద్ద ఆగింది. నిజానికి గురువారం ప్రారంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ సూచీ నష్టాల్లో నడిచింది. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ 59.29 రూపాయలుగా ఉండగా, అది ట్రేడింగ్ ముగిసే సమయానికి 59.33 రూపాయల వద్ద క్లోజ్ అయింది.
ఈ ట్రేడింగ్లో టాటా స్టీల్, భారతీయ స్టేట్ బ్యాంకు, ఓ.ఎన్.జి.సి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తదితర కంపెనీల షేర్లు లాభాల్లో ముగియగా, మాక్స్ ఇండియా, తిలక్ ఫైనాన్స్, కప్పాక్ పార్మా, ప్రజ్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.