Publish Date: Tue, 22 Sep 2020 (10:56 IST)
Updated Date: Tue, 22 Sep 2020 (10:59 IST)
భారత స్టాక్ మార్కెట్ మంగళవారం కూడా కుప్పకూలింది. ఇలా జరగడం వరుసగా రెండోరోజు కావడం గమనార్హం. దీంతో నిమిషాల్లో రూ.2 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సోమవారం భారీగా పతనమైన స్టాక్ మార్కెట్ సూచీ మంగళవారం కూడా ఏకంగా 800 పాయింట్ల మేరకు పడిపోయింది.
మంగళవారం సెషన్ ఆరంభమైన నిమిషాల వ్యవధిలోనే 400 పాయింట్లకు పైగా పతనం నమోదైంది. దీంతో సోమవారం రూ.4 లక్షల కోట్లకు పైగా హరించుకుపోయిన ఇన్వెస్టర్ల సంపద, మంగళవారం మరో రూ.2 లక్షల కోట్లు తగ్గింది.
ఈ ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స్ 420 పాయింట్ల పతనంతో 37,614 పాయింట్ల వద్దా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 144 పాయింట్ల పతనంతో 11,106 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి.
కీలకమైన మద్దతు స్థాయిల వద్ద కూడా అమ్మకాలు వెల్లువెత్తుతుండగా, మార్కెట్ మరింతగా నష్టపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 30లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే స్వల్ప లాభాల్లో ఉండగా, మిగతా కంపెనీలన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.