Bhadrakali Temple Warangal
తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ, వరంగల్ నగరాల మధ్య ఓ కొండపై భద్రకాళీ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత అయిన భద్రకాళీ అమ్మవారు భయంకర రూపంలో పెద కళ్లు, గంభీరమైన ముఖం, ఎనిమిది చేతులు, వాటికి వేరు వేరు ఆయుధాలతో సింహ వాహనంపై కూర్చుని దర్శనమిస్తుంది.
క్రీస్తు శకం 625లో చాళుక్య రాజవంశం రాజు 2వ పులకేసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు. తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కాకతీయులు అమ్మవారిని విశేషంగా పూజించేవారు. వారు అమ్మవారి ఎడమ కంటికి కోహినూర్ వజ్రాన్ని అమర్చారు. ఈ మనోహరమైన వజ్రాన్ని కొల్లూర్ గనులు (గోల్కొండ గనులు) నుంచి వెలికి తీశారు.
క్రీస్తు శకం 1310 కాలంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ తన ఆధ్వర్యంలోని ఢిల్లీ సామ్రాజ్యంలోకి కాకతీయ రాజ్యాన్ని తీసుకువచ్చాడు. ఆ సమయంలో భద్రకాళీ ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా అందిన కోహినూర్ వజ్రాన్ని దోపిడి చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు.
బాబర్, హుమయూన్ నుంచి షేర్ షా సూరికు, షేర్ షా సూరి నుంచి షాజహాన్కు, షాజహాన్ నుంచి ఔరంగజేబుకు, ఔరంగజేబు నుంచి పాటియాలా మహరాజ్ రంజిత్ సింగ్ వరకూ తరతరాలుగా ఈ వజ్రం చేతులు మారింది. ప్రస్తుతం బ్రిటీష్ రాణి చేతుల్లో కోహినూర్ వజ్రం వుంది.
భద్రకాళీ ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయం అంటారు. ఈ ఆలయం సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. వరంగల్, హనుమకొండ రహదారిలో కొండల మధ్య ఈ ఆలయం వుంది. ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయి.
కాకతీయుల ఇలవేల్పుగా పూజలందుకున్న ఈ ఆలయానికి ఎంతో చరిత్ర వుంది. భద్రకాళి అమ్మవారు నాలుక బయట పెట్టి రుద్ర రూపంలో కనిపించేది.
ఈ విగ్రహాన్ని తొమ్మిది అడుగుల ఎత్తు, తొమ్మిది అడుగుల వెడల్పుతో ఒకే శిలపై చెక్కారు. ఈ ఆలయం దగ్గరున్న గుహల్లో ఇప్పటికీ సిద్ధులు ఉన్నారని స్థానికులు అంటారు. ప్రస్తుతం ప్రతీరోజూ చండీ హోమం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొంటే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు.