పంబా నదీతీరంలో మహిళలకు స్నాన ఘాట్లు.. శబరిమలలో ప్రత్యేక ఏర్పాట్లు
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కోసం కేరళ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. పంబా నదీతీరంలో మహిళల కోసం ప్రత్యేక ఘాట్లను నిర్మించడంతోపాటు బస్సుల్లో మహిళలకు ప్రత
Publish Date: Mon, 01 Oct 2018 (18:06 IST)
Updated Date: Mon, 01 Oct 2018 (18:07 IST)
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కోసం కేరళ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. పంబా నదీతీరంలో మహిళల కోసం ప్రత్యేక ఘాట్లను నిర్మించడంతోపాటు బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు, మహిళలకు అనుకూలంగా ఉండేలా టాయ్లెట్ల నిర్మాణం వంటి పలు ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది.
ప్రస్తుతం దేశంలో హజ్ యాత్ర తర్వాత శబరిమల యాత్రనే ప్రపంచంలో రెండో అతిపెద్ద యాత్రగా పరిగణిస్తారు. దశాబ్దాలుగా శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశంలేని క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించిన విషయం తెల్సిందే. సుప్రీం తీర్పును మేథావులు, అభ్యుదయవాదులు స్వాగతించగా, సంప్రదాయాలు, ఆచారాలకు ఈ తీర్పు విరుద్ధమని హిందూ వర్గాలు మండిపడుతున్నాయి. అయితే, కేరళ సర్కారు మాత్రం సుప్రీం తీర్పు మేరకు ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమవుతోంది.