వైభవోపేతంగా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవం ... భారీగా తరలివచ్చిన భక్తజనం
కడప జిల్లా ఒంటిమిట్టలో కొలువై ఉన్న సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. వేలాదిమంది భక్తుల రామ స్మరణల మధ్య కన్నుపండువగా స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించారు టిటిడి వేదపండితులు. అంతకుముందు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వ
Publish Date: Wed, 20 Apr 2016 (19:55 IST)
Updated Date: Wed, 20 Apr 2016 (19:59 IST)
కడప జిల్లా ఒంటిమిట్టలో కొలువై ఉన్న సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. వేలాదిమంది భక్తుల రామ స్మరణల మధ్య కన్నుపండువగా స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించారు టిటిడి వేదపండితులు. అంతకుముందు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు వేదపండితులు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో సీతా,రాములను అభిషేకించారు.
ఎపి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఆలయంలో వేదపండితులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందుకున్నారు. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులు కూడా కళ్యాణోత్సవానికి హాజరయ్యారు.
అంతకుముందు సీతారామలక్ష్మణుల ఉత్సవ మూర్తులను, తిరుమల శ్రీవారి ఆలయం నుంచి కానుకగా వచ్చే ఆభరణాలను ఆలయం నుంచి కళ్యాణవేదిక వరకు శోభాయాత్రగా తీసుకెళ్ళారు. కళ్యాణవేదిక వద్ద అన్నమయ్య కీర్తనల ఆలాపన, వేద స్వస్తి, ఎదుర్కోలు ఉత్సవాలను నిర్వహించారు.
సాధారణ భక్తులకు, విఐపిలకు, టిటిడి ఉద్యోగులకు, వివిఐపిలకు వేరువేరుగా ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలు ఏర్పాటు చేశారు. ఎండవేడి నుంచి ఉపశమనం కోసం వేదిక ప్రాంగణంలో నిరంతరాయంగా నీటితో పిచికారి చేస్తున్నారు. అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్ సిబ్బంది, మందులు, ఆంబులెన్స్ లు అందుబాటులో ఉంచారు.