Publish Date: Sun, 27 Mar 2016 (11:28 IST)
Updated Date: Sun, 27 Mar 2016 (11:30 IST)
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా నాలుగురోజుల పాటు సెలవు దినాలు కావడంతో ప్రపంచ నలమూలల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో ఎటు చూసిన భక్త జనసందోహమే దర్శనమిస్తోంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. తిరుమలలో ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులే తిరుమలలో ఎక్కువగా కనిపిస్తున్నారు.
కొండపైకి భక్తుల తాకిడి అధికం కావడంతో తితిదే అధికారులు ఎప్పటిలాగే చేతులెత్తేశారు. తమకేమీ సంబంధం లేనట్లు భక్తులను రోడ్లపైనే వదిలేశారు. తితిదే ఏర్పాటు చేసిన ఆన్లైన్ స్క్రీన్లలో గదులు లేవంటూ అన్నీ సున్నాలు చూపిస్తున్నాయి. దీంతో భక్తులు పార్క్ లతోపాటు, ఫుట్పాత్లపై సేదతీరుతున్నారు. ఆదివారం సాయంత్రం వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
ఇదిలావుండగా, శనివారం శ్రీవారిని 87,301 మంది భక్తులు దర్శించుకోగా ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 17 గంటలకుపైగా దర్శన సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 9 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 68 లక్షల రూపాయలు వచ్చింది.