తిరుమలలో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అపచారం.. శ్రీవారికి యు ఆకారంలో నామాలు పెట్టారు!
తిరుమలలో మరో అపచారం జరిగింది. ఇది పెద్ద దుమారాన్నే రేపేలా ఉంది. ప్రతి శుక్రవారం స్వామివారికి నిర్వహించే తోమాల సేవలో ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అపచారం చేశారంటూ జియ్యంగార్లు తిరుమల తిరుపతి దేవస్థానం
Publish Date: Fri, 04 Nov 2016 (16:55 IST)
Updated Date: Fri, 04 Nov 2016 (16:59 IST)
తిరుమలలో మరో అపచారం జరిగింది. ఇది పెద్ద దుమారాన్నే రేపేలా ఉంది. ప్రతి శుక్రవారం స్వామివారికి నిర్వహించే తోమాల సేవలో ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అపచారం చేశారంటూ జియ్యంగార్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ సాంబశివరావుకు ఫిర్యాదు చేశారు.
తోమాలసేవ తర్వాత స్వామివారికి u, y ఆకారాల్లో కాకుండా మధ్యస్తంగా నామాన్ని పెట్టాలి. అయితే ఆ సాంప్రదాయాన్ని పక్కనబెట్టి u ఆకారంలో స్వామివారికి నామాలను పెట్టారు రమణదీక్షితులు.
వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అయితే వడగళై u ఆకారం, తంగలై y ఆకారంలో స్వామివారికి నామాలు పెట్టాల్సి ఉంది. అయితే వైష్ణవ సాంప్రదాయాన్ని మంటగలిపారంటూ జియ్యంగార్లు రమణదీక్షితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రమణదీక్షితులకు నోటీసులు అందించేందుకు టిటిడి సిద్ధమైంది.
దీనిపై రమణ దీక్షితులు స్పందిస్తూ.. శ్రీవేంకటేశ్వరస్వామి వారి నామాలను తాను మార్చలేదన్నారు. 45 ఏళ్లుగా శ్రీవారికి సేవ చేస్తున్నానని... ఇలాంటి పనులు తాను చేయనని స్పష్టం చేశారు. తన కుటుంబాన్ని కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని... తమపై లేనిపోని నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల మేరకే తన మనవడిని గర్భాలయంలోకి తీసుకెళ్లానని చెప్పారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంలో నైవేద్య విరమణ సమయంలో తన మనవడిని గర్భాలయంలోకి తీసుకెళ్లారన్న ఆరోపణల నేపథ్యంలో రమణ దీక్షితులకు టీటీడీ ఈవో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా, శ్రీవారి నామాలను మార్చారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.