Publish Date: Sat, 26 Mar 2016 (17:34 IST)
Updated Date: Sat, 26 Mar 2016 (17:36 IST)
నిత్యకళ్యాణం... పచ్చతోరణం... పెళ్ళిళ్ల ప్రియుడు తిరుమల వెంకన్న. ఆయన సన్నిధిలో మూడు ముళ్ళు వేసుకుంటే పదికాలాల పాటు వారి కాపురం పచ్చగా ఉంటుందన్నది భక్తుల విశ్వాసం. అందుకే పెద్దపెద్ద వీఐపీలు కూడా తిరుమలలో స్వామివారి సన్నిధిలో పెళ్ళిళ్లు చేసుకోవాలని కోరుకుంటారు. ఇందుకోసం టిటిడి వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది.
960 రూపాయలు డిపాజిట్ చేస్తే పురోహితుడి దగ్గరి నుంచి వీడియో తీసుకునే వరకు తితిదే అనుమతిస్తుంది. అయితే ఆ కొద్దిపాటి డిపాజిట్ను కూడా రద్దు చేసి కళ్యాణం పేరుతో మరో నూతన పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు టిటిడి కార్యనిర్వహణాధికారి సాంబశివరావు.
ఈ కళ్యాణం పథకం కింద రిజిస్టర్ చేసుకున్న వారికి వివాహం చేసుకోవడానికి ఎలాంటి ఖర్చు లేకుండా టిటిడినే ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ప్రతిపేదవాడు కూడా స్వామివారి సన్నిధిలోనే వివాహం చేసుకునే విధంగా తితిదే తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు అభినందిస్తున్నారు. స్వామివారి సన్నిధిలో గతంలో కంటే కూడా భవిష్యత్తులో మరిన్ని వివాహాలు కూడా జరిగే అవకాశం లేకపోలేదు.