Publish Date: Fri, 18 Mar 2016 (13:07 IST)
Updated Date: Fri, 18 Mar 2016 (13:19 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో వాడి వేడి చర్చ జరుగుతోంది. సేవా టికెట్ల రేట్లను పెంచడంతో పాటు గదుల అద్దెను పెంచాలన్న విషయంపై బోర్డు ఛైర్మన్ టిటిడి ఈఓతో పాటు సభ్యుల మధ్య రభస కొనసాగుతోంది. ప్రధానంగా విఐపి బ్రేక్, కళ్యాణోత్సవం, తోమాల, అర్చన, సుప్రభాతం, మరికొన్ని సేవా టికెట్ల రేట్లను పెంచడంతో పాటు తిరుమలలోని అన్ని గదుల అద్దెను ఎక్కువ చేయాలన్న ప్రతిపాదనను టిటిడి ఛైర్మన్ ఎప్పటి నుంచో సభ్యులకు చెబుతూ వచ్చారు.
అయితే ఛైర్మన్ ప్రతిపాదనను బోర్డు సభ్యులు తిరస్కరిస్తూనే వస్తున్నారు. గతంలో జరిగిన పాలకమండలి సమావేశంలో కూడా ఈ విషయాన్ని టిటిడి ఛైర్మన్ ప్రతిపాదించగా బోర్డు సభ్యులందరు తిరస్కరించారు. శుక్రవారం జరిగే బోర్డు సమావేశంలో మాత్రం ఖచ్చితంగా రేట్లను పెంచితీరాలన్న పట్టుదలతో ఛైర్మన్ ఉన్నారు. ఉదయం 9 గంటలకు పాలకమండలి సమావేశం ప్రారంభం కాగానే గందర గోళం నెలకొంది. ఛైర్మన్ టికెట్ల పెంపు విషయాన్ని తెలుపగానే సభ్యులందరు ఒక్కసారిగా ఆగ్రహంతో వూగిపోయారు. ఈ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఛైర్మన్ను కోరారు. దీంతో సమావేశంలో గందరగోళం కొనసాగుతోంది.