Publish Date: Mon, 07 Dec 2015 (16:59 IST)
Updated Date: Mon, 07 Dec 2015 (17:00 IST)
తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమల కొండపైకి చేరుకునేందుకు ప్రస్తుతం రెండు ఘాట్ రోడ్డు మార్గాలున్న సంగతి తెలిసిందే. మొదటి ఘాట్ రోడ్డును కొండపై నుంచి కిందకు వచ్చేందుకు, రెండో ఘాట్ రోడ్డును కింద నుంచి పైకి ఎక్కేందుకు వాడుతుండగా.. రెండు రోడ్లకూ మధ్య ఓ లింక్ రోడ్డు కూడా ఉంది.
కాలినడకన తిరుమల చేరే భక్తుల కోసం, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలతో పాటు కడప జిల్లా నుంచి అన్నమయ్య మార్గం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల కొండపైకి మూడో ఘాట్ రోడ్డును నిర్మించాలని తితిదే నిర్ణయించింది.
అయితే ఈ మూడో ఘాట్ రోడ్డు ఏవైపు ఉండాలని.. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టీటీడీ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించింది. గతంలో కూడా మూడో మార్గం నిర్మించాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. శ్రీవారి మెట్టు మార్గానికి అవతలి నుంచి.. అంటే చంద్రగిరి కొండలవైపు నుంచి రహదారికి అనుకూలమని తేల్చారు. అంతేగాకుండా రేణిగుంట వైపు నుంచి మరో రహదారిని నిర్మించవచ్చునని సూచించారు.