తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల గిరులు మొత్తం భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. తిరుమల జిఎన్సి టోల్గేట్ నుంచి గార్డెన్లు, చెట్ల కింద, ఖాళీగా ఉన్న ప్రాంతాలు ఎక్కడ చూసినా భక్తులే. శనివారం రాత్రి నుంచి రద్దీ మరింత పెరిగింది. ఆదివారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లన్నీ బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తుల కంపార్టుమెంట్ల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుండగా కాలినడకకు 13గంటలకు పైగా సమయం పడుతోంది.
తితిదే పైన పేర్కొన్న సమయంలోపన దర్శనం చేయిస్తామని చెబుతున్నా ఆ సమయం రెట్టింపవుతోంది. గదులన్నీ నిండిపోయాయి. తల నీలాల కోసం గంటల తరబడి పడిగాపులు. నిన్న శ్రీవారిని 80 వేల మందికిపైగా దర్శించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 53 లక్షల రూపాయలు లభించింది.