తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... శ్రీవారి సేవలో సచిన్ - చిరంజీవి - నాగార్జున
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గత 15 రోజులకుపైగా రద్దీ కొనసాగుతుండగా ప్రస్తుతం మాత్రం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 6 గంట్లోనే శ్ర
Publish Date: Wed, 01 Jun 2016 (10:39 IST)
Updated Date: Wed, 01 Jun 2016 (11:42 IST)
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గత 15 రోజులకుపైగా రద్దీ కొనసాగుతుండగా ప్రస్తుతం మాత్రం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 6 గంట్లోనే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం పడుతోంది. గదులు సులువుగానే లభిస్తున్నాయి. తలనీలాలను గంటలోపే స్వామివారికి భక్తులు కళ్యాణకట్టలలో సమర్పిస్తున్నారు. మంగళవారం శ్రీవారిని 84,746 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 72 లక్షల రూపాయలు లభించింది.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్తో పాటు సినీనటుడు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్లు అర్చన సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల సచిన్తో పాటు సినీనటులకు కరచాలనం చేసేందుకు భక్తులు ఎగబడ్డారు. సచిన్ నవ్వుతూనే ఆలయం నుంచి బయటకు వచ్చారు. అందరికీ రెండు చేతులతో నమస్కారం చేశారు సచిన్. కాగా, ఈ ప్రముఖులంతా మంగళవారం రాత్రి చార్టెడ్ విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు.