Publish Date: Sat, 14 May 2016 (10:52 IST)
Updated Date: Sat, 14 May 2016 (11:09 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత రెండు రోజుల నుంచి తిరుమల గిరులలో ఇదే పరిస్థితి. సెలవు దినాలతో పాటు 10వ తరగతి పరీక్షా ఫలితాలు రావడంతో అధికసంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శనివారం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది.
అలాగే కాలినడక భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 8 గంటలకుపైగా సమయం పడుతోంది. తలనీలాలతో పాటు గదుల కోసం భక్తులు తిరుమలలో పడిగాపులు కాస్తున్నారు. ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలను తితిదే మంజూరు చేస్తోంది. మిగిలిన వారి సిఫార్సు లేఖలను తితిదే స్వీకరించడం లేదు. శుక్రవారం శ్రీవారిని 74,350 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.59 కోట్లు వచ్చింది.