శ్రీవారి ఆలయం ఐదు రోజులు కాదు.. తొమ్మిది రోజులు మూతపడనుందట..
తిరుమల తిరుపతి దేవస్థానం తొమ్మిది రోజులు మూతపడనుంది. ఈ ఏడాది 2018 ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయం మూతపడనుంది. 12 సంవత్సరాలకు ఓసారి నిర్వహించే మహా సంప్రోక్షణ సందర్భంగా భక
Publish Date: Sat, 14 Jul 2018 (14:32 IST)
Updated Date: Sat, 14 Jul 2018 (14:34 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం తొమ్మిది రోజులు మూతపడనుంది. ఈ ఏడాది 2018 ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయం మూతపడనుంది. 12 సంవత్సరాలకు ఓసారి నిర్వహించే మహా సంప్రోక్షణ సందర్భంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు తిరుమల పాలక మండలి ప్రకటించింది.
ముందుగా ఐదు రోజులు మాత్రమే అని సంకేతాలు ఇచ్చినా.. అత్యవసరంగా సమావేశం అయిన పాలక మండలి తొమ్మిది రోజులు శ్రీవారి దర్శనం సామాన్యులకు లేదని ప్రకటించింది.
ఇందులో భాగంగా.. ఆగస్టు 9వ తేదీ నుంచి తిరుమలకు భక్తులను అనుమతించరు. ఆగస్టు 11వ తేదీన మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరుగుతుంది. 12 నుంచి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆగమశాస్త్ర పండితుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలక మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు.
ఆగస్ట్ 9వ తేదీ ఉదయం నుంచి ఆగస్ట్ 17వ తేదీ సాయంత్రం వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేస్తారు. ఈ తొమ్మిది రోజులు కేవలం 30వేల మందికి మాత్రమే దర్శనం కల్పించనున్నారు. ఇది కూడా వీఐపీలకు మాత్రమే అవకాశం ఉండొచ్చు. సామాన్య భక్తులకు మాత్రం ఎంట్రీ ఉండదు. తొమ్మిది రోజులు శ్రీవారి దర్శనం నిలిపివేయటం చరిత్రలో ఇదేనని పండితులు అంటున్నారు.