Publish Date: Tue, 17 May 2016 (14:26 IST)
Updated Date: Tue, 17 May 2016 (14:27 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ప్రాముఖ్యత కలిగిన చిత్తూరు జిల్లాలోని ముక్కంటీశుని క్షేత్రం శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. గత నాలుగురోజులుగా ఖాళీగా ఉన్న వాయులింగేశ్వర క్షేత్రం ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతోంది. మంగళవారం ఉదయం నుంచి గంటల తరబడి స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ముక్కంటీశుని దర్శనం 5 గంటలకుపైగా పడుతోంది.
మరోవైపు శ్రీకాళహస్తి చరిత్రలో రాహుకేతు పూజ రికార్ఢు స్థాయిలో జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో పాటు అక్కడి నుంచి వచ్చిన తమిళ భక్తులు, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం నిండిపోయింది. రాహు, కేతు పూజ నిర్వహించే ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. ఆలయ ఆవరణలో భక్తులను కూర్చోబెట్టి శ్రీకాళహస్తి దేవస్థానం పూజారులు రాహు, కేతు పూజ నిర్వహిస్తున్నారు.