Publish Date: Fri, 08 Apr 2016 (12:43 IST)
Updated Date: Fri, 08 Apr 2016 (12:45 IST)
శ్రీవారి భక్తుల కోసం సిద్ధం చేసిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన సముదాయాన్ని భక్తుల కోసం శుక్రవారం నుంచి ప్రారంభించారు. వైకుంఠం-1కు అతిసమీపంలో ఏటీసీ కార్ల పార్కింగ్ల వద్ద సముదాయాలను తితిదే ఏర్పాటుచేసింది. ఈ సముదాయాలను తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, కార్యనిర్వహణాధికారి సాంబశివరావులు ప్రారంభించారు.
ఈ లైన్ల ద్వారా వెళ్లే భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా స్వామి చెంతకు చేరుకోవచ్చు. గతంలో శంఖుమిట్ట నుంచి భక్తులను ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమతించేవారు. అయితే శంఖుమిట్ట నుంచి దర్శనానికి వెళ్లేందుకు చాలా దూరంగా ఉంటోందని భక్తులు తితిదే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తితిదే నూతన సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ఉగాది పర్వదినం రోజునే ఈ సముదాయాలను ఏర్పాటు చేయడంపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతి దగ్గరగా త్వరితగతిన భక్తులు దర్శనం చేసుకునే వీలుంటుందని తితిదే ఛైర్మన్ చదలవాడ మీడియాకు తెలిపారు.